Tuesday, March 18, 2014

అమ్మమ్మ కథ కీలుగుర్రం










  • చిత్రం పేరు - కీలుగుర్రం
  • నిర్మాత, దర్శకులు - శ్రీ మీర్జాపురం రాజా వారు
  • సహాయ దర్శకుడు - యం.కొండయ్య
  • కథ, మాటలు, పాటలు - తాపీ ధర్మారావునాయుడు
  • తారాగణం -అంజలీదేవి, నాగేశ్వరరావు, ఏ.వి.సుబ్బారావు, రేలంగి , కనకం, సురభి కమలాబాయి, జూనియర్ లక్ష్మీరాజ్యం తదితరులు..........
  • సంగీత దర్శకుడు - ఘంటసాల వెంకటేశ్వరరావు
  • నేపథ్య గాయకులు -సి.కృష్ణవేణి, ఘంటసాల, పి.లీల, వి.సరళ, శ్రీదేవి
  • నిర్మాణ సంస్థ - శోభనాచల పిక్చర్స్
  • పంపిణీ సంస్థ---చమ్రియా టాకీ డిస్టిబ్యూటర్స్, యశోధర ఫిలిం కార్పరేషన్
  • విడుదల తేది - ఫిబ్రవరి19, 1949

ఇది జానపద చిత్రకథ. అనగనగా ఒక రాజు అని మా అమ్మమ్మ కథ మొదలు పెట్టిందంటే చాలా ఆశక్తిగా పిల్లలందరం ఆమె చుట్టూ చేరి కథ మొత్తం అయ్యే వరకూ పడుకునే వాళ్ళంకాదు..  రాజు వేటకి వెళ్ళడంతో  కథ మొదలవుతుంది. ఒక  రాక్షసి (అంజలీదేవి) మొహినిలా మారి రాజుని ప్రేమించి పెళ్ళి చేసుకుని రాజుగారితో రాజ్యానికి  వచ్చి రెండవ భార్యగా ఉంటూ,  రాత్రివేళల్లో రాక్షసిగామారి ఏనుగుల్ని చంపి తిని ఆ నేరాన్ని పెద్ద రాణిపై వేస్తుంది. అది నమ్మిన రాజు, గర్భవతి అయిన పెద్ద రాణిని చంపేయమని అడవికి పంపిస్తాడు. అడవిలో నిండు చూలాలిని చంపడానికి చేతులురాని బంట్లు ఆమె కళ్ళను పీకి వాటిని రాణీకి గుర్తుగా తీసుకు వస్తారు. పెద్ద రాణికి కోయగూడెంలో ఆశ్రయం దొరుకుతుంది. అక్కడే ఓ మగ బిడ్డను ప్రశవిస్తుంది. అతడే (అక్కినేని) , అక్కడే పెరిగి అన్ని విద్యలలో ప్రవీణుడౌతాడు. చిన్ననాడే అపహరణకు గురైన రాకుమారిని పట్టి తెస్తే అర్థరాజ్యం, కుమాత్తెను ఇస్తానని పొరుగురాజు ప్రకటనను అనుసరించి చాలా శ్రమించి ఓ కీలుగుర్రాన్ని తయారుచేస్తాడు ఓ పండితుడు. వయసు మీద పడిన ఆ పండితుడు, దాన్ని అధిరోహించి రాకుమారిని తేగల సాహసవంతుని కోసం ఎదురుచూస్తాడు. అతడే మన కథానాయకుడు అక్కినేని. ఆకాశంలో విహరించే కీలుగుర్రాన్ని అధిరోహిస్తాడు. దొంగలబారి నుండి కథానాయిక (లక్ష్మీరాజ్యం) ను కాపాడతాడు. తండ్రి రాజ్యంలోనే సేనానిగా చేరతాడు. అతడిని చూసిన రాజు మనసు ఏదో తెలియని మమకారానికి లోనౌతుంది.ఈ సంగతి తెలిసిన మోహిని తనకు తలనొప్పిగా వుందని అందుకు తగిన మందు తెమ్మని కథానాయకున్ని పంపుతుంది. కీలుగుర్రం సహాయంతో ఆ మందు తెచ్చే ప్రయత్నంలో ఎన్నో సాహసాలు చేస్తాడు కథానాయకుడు. ఆ మందు కంటే విలువైన రాక్షసి ప్రాణాలు చిన్న పురుగులో వుండడం గమనించి వాటిని సంగ్రహిస్తాడు. తల్లిని ఉరి తీసే సమయానికి ఆమె కళ్ళతో సహా అక్కడకు వచ్చి రాక్షసిని అంతమొందిస్తాడు. తల్లికి తిరిగి రాజరిక ప్రవేశం కలిగిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. 

ఇందులో పాటలు ఎనిమిది ఉన్నా అన్నింటికంటే నాకు" కాదు సుమా కల కదు సుమా" చాలా నచ్చిన పాట.




నాగేశ్వరరావు నటనకంటే నాకు అంజలీదేవి నటన చాలా చిత్రంగా ఆమె హావభావాలతో రాక్షసి అంటే ఇలానే ఉంటుందేమో అనేట్టుగా చిన్నవయసులో అనిపించేది. ఆమె నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోయగలదు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా అన్నీ మయలతో ఆశక్తిగా సాగే కథ,  మా చిన్ననాటి నుండీ మా హృదయాల్లో ఓ సినిమాగా కాక ఓ రాజుగారి కథగా మిగిలిపోయింది. పెద్దయ్యాకా సినిమా చూస్తుంటే అమ్మమ్మ చెప్పిన తీరుకు ఏ మాత్రమూ భిన్నంగా అనిపించలేదు. అంతగా నన్ను ఆకర్షించిందీ కీలుగుర్రం.


మళ్ళీ వచ్చేవారం మరో సినిమాతో కలుద్దాం... 


Monday, March 10, 2014

నాతోటలో గులాబి




                                     


తన నటనతో మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి గారి గురించి ఎందరో తమ తమ బ్లాగుల్లో రాసాకా చాలా ఆలస్యంగా ఈ పోస్ట్ పెడుతున్నాను. నాన్నగారి వల్ల పాత సినిమాలు చూడటం అలవాటు చేసుకున్న నాకు ఇప్పుడు అదో వ్యసనంగా తయారయింది. అందరినాయికల్లోకి నాటికీ, నేటికీ, ఏనాటికీ మన మనస్సుల్లో దేవతగా నిలిచిపోయిన  మహానటి సావిత్రి గురించి నాకు తెలిసినంత. 

సృష్టిలో అందాలన్నీ తెచ్చి పోతగా పోసి సావిత్రిగా మలిచి ఉంటాడా దేవుడు. ఆమె రూపాన్ని మరింత అందంగా వర్ణించలేకపోతున్నందుకు, నేను కవిని కానందుకు, మొదటి సారిగా బాధ పడుతున్నాను. ఆమె ఎవరో, ఏమిటో తెలియని చిన్నతనం నుండీ ఆ రూపం నాకు పరిచయస్తురాలే అనిపించింది.


ఆ అందాలరాశి అందమంతా ఆ కళ్ళలోనే ఉంది. ఆ తెల్ల కలువల్లాంటి కళ్ళు మన కెన్నో ఊసులు చెపుతాయి. నేటి తరం నాయికలకు ఆదర్శం సావిత్రి. ఆమె స్థానాన్ని ఇప్పటి వరకు అందుకున్న తారలు లేరు. దేవదాసు, నాదీ ఆడజన్మే, మయా బజార్, మిస్సమ్మ, పాండవ వనవాసం, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల......మొదలైన చిత్రాలు సావిత్రిలోని నటనకు గీటురాళ్ళు. తను నటించిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి నటించింది. కనుకనే ఆపాత్రలు ఇంకా సజీవంగా మన హృదయాల్లో ఉండిపోయాయి. మిస్సమ్మలో మేరి(మహా లక్ష్మి), పాండవ వవవాసంలో (దౌపతి), గుండమ్మ కథలో (లక్ష్మి)పాత్రలు మనస్సులో నిలిచిపోయాయి. 

ఆమె కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు, తనలోని ప్రతిభను నిర్మాతగాను, దర్శకురాలిగా మారి నిరూపించుకుంది సావిత్రి. సావిత్రికి దానగుణం కూడా ఎక్కువేనట. ఆమె జీవితంతో ఎలా గెలవాలని ఓడిపోయిందో అందరికీ తెలుసు, అది చెప్పి అందరి మనసులు బాధ పెట్టలేను.(నా మనసు కూడా).

ఆమె నటించిన చిత్రాలు చూసిన ప్రతి సారీ ఇంత గొప్ప అందం మనం జీవిస్తున్న ఈ లోకంలో పుట్టిందా, నేను పుట్టేనాటికి ఆమె వేరే లోకంలో నటించడానికి వెళ్ళిందంటే ఆమెను స్వయంగా కలుసుకోలేనందుకు బాధ పడుతున్నాను. 









నా తోటలోని పూసిన సావిత్రి అనే పుష్పం ఎన్నటికీ వసివాడదు. దాని సుగంధాలు నా వనాన్నే కాదు నా మనసు లోనూ ఎప్పుడూ గుభాళిస్తూనే ఉంటాయి. ప్రతీ వారం పాత చిత్రాల గురించి తెలుపుతాను.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...

Sunday, March 2, 2014

స్వాగతం

బ్లాగు స్నేహితులందరికీ నమస్కారం. ఈ బ్లాగు ద్వారా నాకు నచ్పిన పాత సినిమాల గురించి ,పాత పాటల

గురించి నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలని ఈ బ్లాగు వ్రాస్తున్నాను.